అమ్మకానికి బీపీసీఎల్‌ రెడీ

కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువు తీరాక ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలను నిర్వీర్యం చేయడమో లేదా వాటిని గంప గుత్తగా అమ్మడమో టార్గెట్ గా పెట్టుకున్నారు. బీజేపీ పార్టీ లక్ష్యం ఏనాడో మరిచి పోయింది. భారతదేశంలో కార్పొరేట్ కంపెనీలు ఉండ కూడదని, స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించాలనేదే ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం. మోదీ దీనికి విరుద్దంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశంలో ఎన్నో ఏళ్లుగా విశిష్టమైన సేవలు అందజేసిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపెనీని ఇప్పుడు జవసత్వాలు లేకుండా చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దివాళా తీసేందుకు రెడీగా ఉన్నాయి. దాదాపు 80 వేల మందికి పైగా ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

తాజాగా దేశంలోనే అతి పెద్ద ఆయిల్ నెట్ వర్క్ కలిగిన సంస్థగా పేరొందిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ను పూర్తిగా దారాదత్తం చేసేందుకు దుకాణం తెరిచారు మన గ్రేట్ పీఎం. ప్రభుత్వ రంగ సంస్థలకు దీనిని ఇవ్వబోమంటూ తేల్చి చెప్పారు. బహుళ జాతి ప్రైవేట్‌ కంపెనీలకే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఐఒసీ వంటి ప్రభుత్వ రంగ కంపెనీలు ఇందు కోసం బిడ్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తోంది. ఐఓసీ వంటి ప్రభుత్వ రంగ కంపెనీలు బీపీసీఎల్‌ ఈక్విటీలో ప్రభుత్వ వాటా 53.29 కోసం కోసం బిడ్‌ చేయడాన్ని అనుమతించక పోవచ్చని స్పష్టమవుతోంది. బీపీసీఎఎల్‌ ఈక్విటీలో ప్రభుత్వ వాటా కొనుగోలు, ఓపెన్‌ ఆఫర్‌ కోసం దాదాపు 90,000 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయి.

ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలు వేటి దగ్గర ఇంత భారీ స్థాయిలో నిధులు లేవు. ఐఓసీ వంటి ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. అయితే బీపీసీఎల్‌ వాటా కోసం బిడ్‌ వేయాలంటే ఈ కంపెనీ కూడా బయటి నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకు రావాల్సి వస్తుంది. అప్పుల భారం తగ్గించుకునే పనిలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా బీపీసీఎఎల్‌పై ఆసక్తి చూపక పోవచ్చని భావిస్తున్నారు. దీంతో సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో, ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ ఎస్‌ఏ, అమెరికాకు చెందిన ఎగ్జాన్‌ మొబిల్‌ వంటి బహుళ జాతి ఇంధన దిగ్గజ కంపెనీలే బీపీసీఎల్‌ ఈక్విటీలో ప్రభుత్వ వాటా కోసం పోటీ పడనున్నాయి.

ఏదైనా ప్రైవేట్‌ కంపెనీకి అప్పగిస్తేనే వినియోగదారులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. టెలికాం, విమానయాన రంగాల్లో ప్రైవేటు కంపెనీల ప్రవేశం తర్వాత చార్జీలు, సామర్ధ్యం, వినియోగదారుల సేవలు మెరుగు పడిన విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గుర్తు చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ మాత్రం బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఈ తిరోగమన చర్యను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.

నిపుణుల నిర్వహణలో లాభాల్లో నడుస్తున్న ఈ నవరత్న కంపెనీని ప్రైవేటీ కరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బీపీసీఎల్‌, ఎ్‌ససీఐ, కాంకర్‌ కంపెనీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని భారత పరిశ్రమలు, వాణిజ్య సంఘాల సమాఖ్య సమర్ధించింది. ఈ నిర్ణయంతో ఈ కంపెనీల పనితీరు మెరుగుపడి ఆధునీకరణ, విస్తరణకు అవసరమైన నిధులు లభిస్తాయని తెలిపింది. మొత్తం మీద బీపీసీఎల్ ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉందన్నమాట.

కామెంట్‌లు