పవర్ మాదే..పవార్ మావోడే


మహారాష్ట్రలో రాజకీయాలు మరింత హీటు పుట్టిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో శివసేనను అధికారంలోకి రాకుండా చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. శివసేనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎన్సీపీని ఎలాగైనా సరే తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ట్రబుల్ షూటర్ అమిత్ షా, భారత దేశ ప్రధాన మంత్రి మోదీలు పావులు కదుపుతున్నారు. తాజాగా పవార్ రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయన మోడీతో కలవనున్నారు. ఈ సమయంలో మోడీ పవార్ కు భారీ ఆఫర్ ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇవ్వన్నీ పుకార్లేనని, మరాఠా పీఠం తమదేనని ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 27 రోజులు గడుస్తున్నా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.

ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయక పోవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివసేనతో కలిసి ఎన్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తుండగా, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలే జరగలేదని చెప్పి షాక్ ఇచ్చారు. 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో శివసేనకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడ నుండి వస్తుందో ఆ పార్టీ నేతలే చెప్పాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాతో సమావేశం తరువాత పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. శరద్ పవార్ తీరుపై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. మహారాష్ట్రలో డిసెంబరు మొదటి వారంలో శివసేన అధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో తాము త్వరలోనే నరేంద్ర మోదీని కలిసి రైతుల సమస్యలను గురించి వివరిస్తామని సంజయ్ రౌత్ తెలిపారు. తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతోన్న తరుణంలో తమ పార్టీని ఎన్డీఏ నుంచి తొలగించడంపై, బీజేపీపై శివసేన అధికార పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది. బాల్ థాక్రే ఏడవ వర్ధంతి సందర్భంగా, ఆయనకు దేశం మొత్తం నివాళులు అర్పిస్తున్న సమయంలో బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతోనే ఆ పార్టీ తీరు ఎలాంటిదో స్పష్టమైందని తెలిపారు. 288 అసెంబ్లీ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్‌సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాల్లో విజయం సాధించాయి. మొత్తం మీద బీజేపీని నామ రూపాలు లేకుండా చేస్తామని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!