ఎదురులేని టీమిండియా

టీమిండియా ఇప్పుడు తిరుగులేని విజయాలతో దూసుకెళుతోంది. ప్రత్యర్థి జట్టు ఏ స్థాయిలో ఉన్నా మన జట్టు అలవోకగా గెలుపొందుతూ రికార్డులు తిరుగ రాస్తోంది. ఆయా జట్లకు సాధ్యం కాని రీతిలో ఆట తీరును కనబరుస్తోంది టీమిండియా. ఈ దశాబ్దం ముగిసే వరకు టెస్టుల్లో టీమిండియా అగ్ర స్థానంలో కొనసాగడం ఖాయం. గత మూడేళ్లుగా టెస్టుల్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న భారత జట్టు, ఇప్పటికే ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌లో 300 పాయింట్లతో మరే జట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది. అంతే కాకుండా విజయాల శాతం, గెలు పోటముల నిష్పత్తిలో దూసుకు పోతోంది. ఓ దశాబ్ద కాలంలో అత్యధిక సక్సెస్‌ రేషియో కలిగిన జట్టుగా టీమిండియా తొలిసారి రికార్డు సృష్టించింది.

ఈ పదేళ్ల కాలంలో ఇప్పటి వరకు 106 టెస్టులు ఆడిన భారత్‌ 55 విజయాలు, 29 అపజయాలను చవి చూసింది.  ఇక తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా 89 టెస్టుల్లో 44 గెలువగా, 25 ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక జట్ల సక్సెస్‌ రేషియో వరుసగా 1.39, 1.30, 1.07, 0.91, 0.79 ఉన్నాయి. ఇలా ఓ దశాబ్ద కాలంలో అన్ని మేటి జట్లను అధిగమించి అత్యధిక సక్సెస్‌ రేషియోను సాధించడం టీమిండియాకు ఇది తొలిసారి. ఇప్పటి వరకు క్రికెట్‌ను ఏలిన ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లే అధిక గెలు పోటముల నిష్పత్తిని కలిగి ఉండేవి. అత్యధికంగా 2000-2010 కాలంలో ఆసీస్‌ అధ్యధికంగా 4.39 సక్సెస్‌ రేషియోతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. .

ప్రస్తుత జట్టులోని ప్రతీ ఒక్క ఆటగాడు అద్భుతమైన రీతిలో ఆడుతున్నాడు. బ్యాటింగ్‌లో సారథి విరాట్‌ కోహ్లి, పుజారా, అజింక్యా రహానేలు నిలకడగా ఆడుతుండగా.. రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, శిఖర్‌ ధావన్‌, విహారీ మెరుపులు మెరిపిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో టీమిండియా ఈ మధ్య కాలంలో మరింత రాటు దేలింది. ముఖ్యంగా పేస్‌ అటాక్‌ పదును పెరిగింది. జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మలు పేస్‌ దళాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. కాగా, స్పిన్‌ ద్వయం రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా జట్టుకు కీలకంగా  మారారు. సీమ్‌ పిచ్‌లపై కూడా స్పిన్‌ తిప్పుతూ జట్టుకు విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాబోయే కాలంలో భారత క్రికెట్ జట్టు ఇంకెన్ని విజయాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి.

కామెంట్‌లు