విద్యా శాఖ నిర్లక్ష్యం..నిరుద్యోగుల పాలిట శాపం

కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా తయారైంది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం కొన్నేళ్ల పాటు కొనసాగింది. ఎందరో బలిదానాల సాక్షిగా కొత్త రాష్ట్రం కొలువు తీరింది. ఇక తమ బతుకులు బాగు పడతాయని, తమకందరికీ ఉద్యోగాలు వస్తాయని అందరూ ఆశించారు. కానీ దాదాపు ఆరు ఏళ్ళు కావస్తున్నా నేటికీ కొలువుల భర్తీ విషయంలో ప్రభుత్వం ఊసెత్తడం లేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఆర్టీ పరీక్ష చేపట్టింది. సెలెక్షన్ లిస్ట్ కూడా ప్రకటించింది. కానీ రెండు ఏళ్ళు గడుస్తున్నా నేటికీ నియామక పత్రాలు అందజేయలేదు. తక్షణమే తమకు అప్పాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుతూ సెలెక్ట్ అయిన అభ్యర్థులు సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. మరో వైపు 40 వేలకు పైగా వివిధ పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు వరకు వాటిని భర్తీ చేసిన పాపాన పోలేదు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఒకే ఒక్క సారి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై పలు ఆరోపణలు వచ్చాయి. అయినా సర్కార్ నుంచి స్పందన కనిపించలేదు. మరో వైపు ఎంసెట్ లో స్కామ్ జరగం, అది పూర్తిగా రద్దు చేయడం తిరిగి పరీక్ష చేపట్టడం జరిగింది. ఇంకో వైపు ఇంటర్ పరీక్షల్లో గ్లోబరీనా సంస్థ దెబ్బకు పిల్లలు సూసైడ్ చేసుకున్నా సర్కార్ స్పందించలేదు. వారికి కనీస కాంపన్సేషన్ ప్రకటించలేదు. దీనిపై విపక్షాలు గగ్గోలు పెట్టాయి. విద్యా శాఖలో ఎవరు ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. వేలాది మంది ఇప్పటికే బిఈడీలు, ఎంఈడీలు, టీటీసీ లు ఉత్తీర్ణులైన వారున్నారు. వీరు ప్రభుత్వ పరంగా లేదా ప్రైవేట్ గా ఉద్యోగాలు పొందాలన్నా లేదా ఇంకా ఎక్కడైనా కొలువు చేయాలంటే తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాల్సిందే. 

టెట్‌ నిర్వహణకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి పాఠశాల విద్యా శాఖ నాలుగు నెలల క్రితం ప్రతిపాదనలు పంపించింది.  ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంది. దీంతో అభ్యర్థులు ఈ పరీక్షపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మార్కులు పెంచుకునేందుకు టెట్‌కు హాజరవుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో టీచర్‌గా పని చేసేందుకు కూడా టెట్‌ అర్హతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. దీంతో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు భారీ సంఖ్యలో టెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు గతంలో నిర్వహించిన మూడు టెట్ల కాల పరిమితి ముగిసింది. ఒకసారి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థికి ఏడేళ్ల వరకు కాల పరిమితి ఉంటుంది. దాటితే మళ్లీ టెట్‌ పరీక్ష రాయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో కేవలం  2016 , 2017 లలో మాత్రమే టెట్‌ నిర్వహించారు. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు నిర్వహించాలి. టెట్ పరీక్ష కోసం లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు వేచి చూస్తున్నారు. ప్రభుత్వం కొలువులు భర్తీ చేయక పోయినా కనీసం టెట్ ఎగ్జామ్ అయినా చేపడితే బావుంటుందని వేడుకుంటున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!