అమ్మాయిలు అదుర్స్..ఇండియాదే వన్డే సిరీస్

ఇండియాలో సౌత్ ఆఫ్రికా పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు కోలుకోలేని షాక్ తగిలింది. టెస్టుల్లో పురుషుల జట్టు దక్షిణాఫ్రికాను కంగుతినిపిస్తుంటే... వన్డేల్లో భారత మహిళల జట్టు కూడా సఫారీని చిత్తు చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీ రాజ్ సారధ్యంలోని మహిళా క్రికెట్జ జట్టు చేజిక్కించుకుంది. ఆడిన మూడు మ్యాచుల్లో గెలుపొందింది. ఇదిలా ఉండగా టీమిండియా జట్టు చేతిలో దక్షిణాఫ్రికా వైట్‌వాష్‌ కావడం ఇదే మొదటిసారి. ఆఖరి వన్డేలో భారత్‌ తక్కువ స్కోరునే కాపాడుకొని 6 పరుగుల తేడాతో గెలిచింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. టాప్ ఆర్డర్ నుంచి టెయిలెండర్ల వరకు ఇద్దరు మినహా మిగతా ప్లేయర్స్ చేతులెత్తేశారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 76 బంతుల్లో 5 ఫోర్ల తో 36  పరుగులు చేయగా, శిఖా పాండే  40 బంతుల్లో 35  పరుగులు చేసి స్కోర్ పెంచారు. సఫారీ బౌలర్లలో మరిజన్నె కప్‌ 3, షబ్నమ్, అయబొంగ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 48 ఓవర్లలో 140 పరుగుల వద్ద ఆలవుట్ అయ్యింది.

భారత స్పిన్నర్లు ఏక్తా బిష్త్‌ 3, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌ చెరో 2 వికెట్లు తీశారు. తాజా గెలుపుతో హైదరాబాద్‌ క్రికెటర్, భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మరో ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 100 విజయాలు సాధించిన రెండో కెప్టెన్‌గా గుర్తింపు పొందింది. 20 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో మిథాలీ రాజ్‌ తన సారథ్యంలో భారత్‌కు వందో విజయాన్ని అందించింది. కాగా ఇంగ్లాండ్ కు చెందిన చార్లోట్‌ ఎడ్వర్డ్స్‌ మాత్రమే మిథాలీ కంటే ముందుంది. మొత్తం మీద పురుష, మహిళా జట్లు విజయాలు సాధించడంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!