ఇండియాకు ఇరాన్ స్వాగతం
ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు నిలిపి వేయాలని కోరుతోంది. ఇప్పటికే శాంతి కోసం కృషి చేస్తున్న దేశాలలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. అంతే కాక ఇరాన్, ఇండియాల మధ్య మంచి స్నేహం కూడా ఉన్నది. మరో వైపు యుఎస్ , ఇరాన్ ల మధ్య ఉద్రిక్తలు రోజు రోజుకు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్ రాయబారి అలీ చెగేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి చర్చల కోసం భారత్ ప్రయత్నిస్తే స్వాగతిస్తామని అలీ చెగేనీ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేసే దేశాలలో భారత్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా చర్చల కోసం భారత్ చొరవ తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు.
ఢిల్లీలో ఇరాన్ ఎంబసీ నిర్వహించిన సంతాప సభలో పాల్గొన్న అలీ చెగేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా మధ్య వర్తిత్వం చేయాలని కోరారు. ఇరాన్ అమెరికాల మధ్య శాంతికి ఏ దేశం ప్రయత్నించినా స్వాగతిస్తామని, అలాగే భారత్, ఇరాన్ మధ్య మంచి స్నేహం ఉన్న కారణంగా భారత్ మరింత చొరవ తీసుకోవాలని కోరారు. కాగా ఇరాన్ మిలటరీ జనరల్ ఖాసిమ్ సులేమానీని అమెరికా భద్రత బలగాలు అంత మొందిచిన సమయంలోనూ సంయమనం పాటించాలని భారత్ ఇరాన్ను కోరిన విషయం తెలిసిందే. ఇరాన్ అమెరికా మధ్య వివాదాలు మరింత ముదురు తున్నాయని, ప్రపంచ దేశాలన్ని పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించాలని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది అన్ని దేశాలకు హెచ్చరిక అని పేర్కొంది. ఇరాక్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైల్ దాడి చేసిన విషయం విదితమే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ఎక్కువయ్యాయి. ఈ దాడిలో 80 మందికి పైగా అమెరికన్లు మరణించారని ఇరాన్ మీడియా ప్రకటించింది. అయితే దీనిపై అమెరికా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా తన ఆర్మీ స్థావరాలన్నింటిలో హైఅలర్ట్ ప్రకటించినట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి. దాడులు జరిగిన అనంతరం ఇరాన్ ఆర్మీ చీఫ్ మహ్మమద్ బగ్హేరి అమెరికాను హెచ్చరించారు. ఇరాన్ అమెరికాకు చాలా బలంగా సమాధానం చెబుతుందని, ఇరాన్కు చెడు చేయాలని ప్రయత్నిస్తే అదే రీతీలో అమెరికాకు బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి