మేజావా మజాకా

సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం మరీ చిన్నదై పోయింది. క్షణాల్లో ఏదైనా వైరల్ అవుతోంది. ఇది కూడా ఓ సంచలనమే. ప్రతి రోజూ ఏదో ఒకటి సెన్సేషనల్ అవుతోంది. తాజాగా లోకంలో ఓ అద్భుతమైన వార్తకు తెర తీశాడు జపాన్ కు చెందిన అపార కుబురుడుగా ఇప్పటికే పేరొందిన యుసాకు మేజావా. మనోడు ఉన్నట్టుండి అమెరికా సైతం విస్తు పోయేలా చేశాడు.సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశంలోని అత్యధిక ధనవంతుడు, ఫ్యాషన్ డిజైన్‌ ఇండస్ట్రీ దిగ్గజం మేజావా తన ఫాలోవర్స్‌కి ఏకంగా 64.36 కోట్లు పంచి పెట్టడం హల్‌ చల్‌ చేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకో తెలిస్తే ఆశ్యర్యం కలుగుతుంది. సోషల్‌ మీడియాలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఆయన తన ట్విటర్‌లో అనుచరులు వెయ్యి మందికి ఈ నగదును పంచి పెట్టనున్నారు.

6.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న యుసాకు మేజావా ట్విటర్‌లో తన పోస్ట్‌ను రీట్వీట్ చేసిన వెయ్యి మంది ఫాలోవర్స్‌ను ఎంపిక చేసి వారికి సుమారు రూ .64.36 కోట్లు అంద జేయనున్నామని ప్రకటించడం విశేషం. జపాన్‌ లో రెండవ అతిపెద్ద షాపింగ్‌ సంస్థ జోజో ఇంక్‌ వ్యవస్థాపకుడైన యుసాకు చేసిన ఈ ట్వీట్‌  రికార్డు స్థాయిలో 3.8 మిలియన్ల షేర్లను సాధించింది. 9 లక్షలకు పైగా లైక్‌లు కొట్టేసింది. అంతే కాదు అత్యధిక సార్లు రీట్వీట్‌ అయిన ట్వీట్‌గా నిలిచింది. యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ భావనను నిశితంగా అర్థం చేసుకోవడంలో భాగమే ఈ ప్రయత్నమని యుసాకు మేజావా ట్విటర్‌లో వివరించారు. తాను పెద్ద రాజకీయ నాయకుడిని కానందున, ప్రజల కనీసం ఆదాయంపై ఇంతకు మించి తానేమీ చేయలేనని వరుస ట్వీట్లలో చెప్పుకొచ్చారు.

అంతేకాదు జపాన్‌ ప్రభుత్వం, కనీస ఆదాయ పథకాన్ని...అంటే ప్రతి నెలా పౌరులకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించే ఒక విధానం ప్రవేశ పెట్టవలసిన అవసరాన్ని వివరించారు. మరో వైపు అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యాంగ్ ఇలాంటి పథకాన్ని ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. తాను ఎన్నికైతే 18 ఏళ్ల లోపు ప్రతి వయోజన అమెరికన్‌కు నెలకు వెయ్యి డాలర్లు ఇస్తానని వాగ్దానం చేశారనీ, ఆయననే యుసాకా ఫాలో అయ్యారని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. కాగా  మేజావా ఇటీవల 2023లో ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చంద్రయానానికి సంతకం చేసిన మొదటి ప్రైవేట్ ప్రయాణీకుడిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 

కామెంట్‌లు