భగ్గుమన్న విభేదాలు..రాజశేఖర్ రాజీనామా


మూవీ ఆర్టిస్ట్‌ అసిసోయేషన్‌లో మరోసారి విభేదాలు బయట పడ్డాయి. ‘మా’ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. చిరంజీవి, రాజశేఖర్‌ వాగ్వాదం జరగడం, చిరు కామెంట్స్‌కు రాజశేఖర్‌ అడ్డుపడ్డటం, రాజశేఖర్‌ తీరును చిరంజీవి, మోహన్‌బాబు ఖండించడంతో వివాదం రేగింది. రాజశేఖర్‌ అర్ధంతరంగా కార్యక్రమం నుంచి వెళ్లి పోయారు. ఈ నేపథ్యంలో ‘మా’ జనరల్‌ సెక్రటరీ జీవితా రాజశేఖర్‌ స్పందించారు. మాలోని విభేదాలు తగ్గించి..పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నరేశ్‌ వర్గంతో తమకున్న విభేదాలను తమలో తాము పరిష్కరించు కుంటామని ఆమె చెప్పారు. ప్రతి చోట గొడవలు రావడం సహజ మేనని, తామేమీ దేవుళ్లం కాదు మీలాగే మనుషులమని అన్నారు. చిరంజీవి మా అసోసియేషన్‌కు చాలా టైమ్‌ ఇచ్చారని, మా అభివృద్ధికి ఎన్నో సూచనలు ఇచ్చారని తెలిపారు. చిరంజీవి, మోహన్‌బాబు లాంటి వారి నుంచి ఎంతో నేర్చుకున్నామన్నారు.

రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వమని, ఆయన కొంచెం ఎమోషనల్‌గా ఫీల్‌ అయ్యారని, ఆయన మనస్సులో ఏది దాచుకోరని తెలిపారు. మాను బలోపేతం చేయడం, గౌరవ ప్రదమైన సంస్థగా మార్చడమే తమ ధ్యేయమని జీవిత స్పష్టం చేశారు. నరేశ్‌తో తనకు కానీ, రాజశేఖర్‌కు కానీ వ్యక్తిగత విభేదాలు లేవని, చిన్న చిన్న భేదాభిప్రాయాలను అందరం కలిసి ఉమ్మడిగా పరిష్కరించు కుంటామని చెప్పారు. మరో వైపు సినీ పెద్దలు కూడా ‘మా’లోని విభేదాలను రూపుమాపి.. నరేశ్‌, జీవితారాజశేఖర్‌ వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. దీంతో మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం వివాదంతో రచ్చ రేపినా.. చివరకు పరిస్థితి చల్ల బడిందని అనుకున్న సమయంలో రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కారణమైన రాజశేఖర్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలత చెందిన ఆయన ‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే తన రాజీనామాకు ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ కారణమని, ‘మా’ కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పట్నుంచి అతడి తీరు అస్సలు బాగోలేదని, అంతే కాకుండా అతడితో తమకు పొసగడం లేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో ఆరోపించారు. ఇదిలా ఉండగా ‘మా’ పలు నాటకీయ, ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. డైరీ ఆవిష్కరణ   కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా.. రాజశేఖర్ మైకు లాక్కొన్నాడు. దీంతో వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్‌బాబులకు ఆగ్రహం తెప్పించింది. కావాలని గొడవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చారని రాజశేఖర్‌ను ఉద్దేశిస్తూ చిరంజీవి విమర్శించారు. నిబంధనలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మోహన్ బాబు, కృష్ణంరాజు రాజశేఖర్ చేసిన పనిని తప్పు పట్టారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!