ఇరాన్ పై పెద్దన్న కన్నెర్ర

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశ పౌరులపై గానీ, ఆస్తులపై గానీ దాడులు జరిగితే చూస్తు ఊరు కోబోమని స్పష్టం చేశారు. చాలా వేగంగా..తీవ్రంగా స్పందిస్తామని తెలిపారు. ఇరాన్‌లోని 52 ప్రదేశాలను లక్ష్యంగా ఎంచుకున్నామని వెల్లడించారు. ఆ లక్ష్యాల్లో ఇరాన్‌లోని ముఖ్య ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇరాన్‌ సహా తమను బెదిరించే వారిపై ఎలాంటి చర్య అయినా తీసుకునేంతటి శక్తి అమెరికాకు ఉందన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న ఒక ఉగ్రవాద నాయకుడిని చంపితే..ఇరాన్‌ అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి మాట్లాడుతోంది.

ఇప్పటికే ఖాసీం సులేమాని మా రాయబార కార్యాలయంపై దాడి చేశాడు. అలాగే తమకు చెందిన ప్రాంతాలపై, ఆస్తులపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. విదేశాల్లోని అమెరికా ప్రజలకు గానీ, ఆస్తులను తాకాలని ఇరాన్‌ భావిస్తే ఇది వారికి ఒక హెచ్చరిక అవుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు. బాగ్దాద్‌ విమానాశ్రయం వద్ద అమెరికా డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ సైనిక జనరల్‌ ఖాసీం సులేమాని, ఇరాకీ పారా మిలటరీ అధిపతి అబు ముహందిస్‌ మరణించిన సంగతి తెల్సిందే. సులేమానీని చంపడాన్ని తీవ్రంగా ఖండించిన ఇరాన్‌..అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే బాగ్దాద్‌లోని బలాడ్‌ అమెరికా వైమానిక స్థావరంపై రాకెట్‌ దాడి జరిగింది. అలాగే యూఎస్‌ స్థావరాలపై దాడి చేసేందుకు ఇరాక్‌లోని ఇరాన్‌ అనుకూల వర్గాలు యత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఈ రకమైన హెచ్చరిక చేశారు. ఇదిలా ఉండగా ఐక్య రాజ్య సమితి ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. సామాన్య పౌరులు చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. యూఎన్ఓ దేశాల మధ్య యుద్దాన్ని కోరుకోవడం లేదు. శాంతి నెలకొనాలని ప్రయత్నం చేస్తోంది. మొత్తం మీద ట్రంప్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఇరాన్ ను టార్గెట్ చేశారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!