సర్వ దర్శనం కోసం తిరుమల సిద్ధం

కోట్లాది భక్తుల కొంగు బంగారంగా భావించే తిరుమల వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలకు లక్షలాదిగా విచ్చేసే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. వేంకటేశ్వరుడికి  ఏకాంతంగా పూజాది  కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 2 గంటలకే దర్శనాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్యులు, వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహావిష్ణువుకు ఏకాదశి, ద్వాదశి అతి ముఖ్యమైనవి.

ధనుర్మాస నెలలో వచ్చే ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో దేవతల ద్వారంగా పేర్కొనే ఉత్తర ద్వారాన్ని వైష్ణవ ఆలయాల్లో తెరిచి ఉంచుతారు. ఆ రోజున స్వామి వారు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా వెలుపలికి వచ్చి భక్తులకు దర్శమిస్తారు. ఇదే సమయంలో  భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వైకుంఠ ద్వార ప్రవేశంతో పాటు స్వామి వారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. ఇదే పర్వదిన సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిస్తారు. పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తారు. వేలాదిగా భక్తులు రానుండడంతో  తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.

దాదాపు 12 టన్నుల పుష్పాలతో ఆలయం, అనుబంధ ఆలయాలను పరిమళ భరిత పుష్పతోరణాలు, పలు రకాల పండ్ల తోరణాలతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఇల వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీపాలంకరణలతో కొండ ప్రకాశిస్తోంది. ప్రధాన రహదారులన్నీ విద్యుత్‌ వెలుగులతో దేదీప్య మానంగా దర్శనమిస్తున్నాయి. వైకుంఠ ద్వారాలతో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గోవిందమాల భక్తులు ఇరుముడులను చెల్లించేందుకు ఆలయం వెలుపల హుండీలను ఏర్పాటు చేశారు. వాహన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులను కొలువు దీర్చి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 2500 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరో 200 మంది స్పెషల్‌ పార్టీ పోలీసులతో ప్రముఖులకు బందోబస్తును కల్పిస్తున్నారు. ఘాట్‌ రోడ్లలో నిరంతరాయంగా కూంబింగ్‌ నిర్వహించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పర్వదినాల దృష్ట్యా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, టైమ్‌స్లాట్, దివ్య దర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. ద్వాదశి నాడు మాత్రం 2,500 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో భక్తులకు కేటాయించింది. సర్వదర్శనం ద్వారానే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. పూజాది కార్యక్రమాలు, నైవేద్యం, విశ్రాంతి, ప్రముఖుల దర్శనాలను మినహాయిస్తే దాదాపు 43  గంటల పాటు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

వచ్చిన ప్రతి భక్తుడికి దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా పద్మావతి అతిథి గృహం ప్రాంతంలోని రామరాజు, సీతా నిలయం వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే వసతి, దర్శన పాసులను జారీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తేనే 6 టిక్కెట్లు, అధికారులకు 4 టిక్కెట్లను జారీ చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇప్పటికే దాదాపు 20 మందికి పైగా న్యాయమూర్తులతో పాటు 20మంది మంత్రులు, దాదాపు 150 మందికి పైగా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు వస్తున్నట్లు టీటీడీకి సమాచారం అందింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!