జగన్ ను కలిసిన వంశీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మారి పోతున్నాయి. ఏపీలో వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి హవాను తట్టుకుని నిలబడిన తెలుగుదేశం పార్టీ నేతల్లో వల్లభనేని వంశీ ఒకరు. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. గతంలో తాను దివంగత పరిటాల రవీంద్ర అనుచరుడినని పలుమార్లు చెప్పారు కూడా. కృష్ణా జిల్లాలో వంశీ పంచాయితీలు చేస్తారని, ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తుంటారని, అవసరమైతే బెదిరింపులకు దిగుతారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆయన పార్టీ వీడుతారన్న ప్రచారం జరిగింది. తాజాగా వల్లభనేని వంశీ ఇటీవల బీజేపీలో చేరిన సుజనా చౌదరిని కలిశారు. అనంతరమే ఆయన నేరుగా జగన్ వద్దకు వెళ్లారు. అక్కడ మంత్రులు పేర్ని నాని, కోడలి నానీలతో కలిసి జగన్ తో భేటీ అయ్యారు.
అయితే వ్యక్తిగతంగా దాదాపు అరగంట కు పైగా చర్చించారు. తన నియోజక వర్గం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయమని మాత్రమే అడిగానని ఈ సందర్బంగా వంశీ చెప్పారు. కాగా వంశీ పార్టీ మారుతారన్న పుకార్లు షికారు చేసాయి. ఇటీవల టీడీపీకీ వంశీ దూరంగా ఉన్నారు. అంతకు ముందు వైసీపీ నేతలు తమ ఓటమిని తట్టుకోలేక వంశీపై కేసులు నమోదు చేయించారు. దీనిపై వల్లభనేని వంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారితేనే భవిష్యత్తు బాగుంటుందని కొడాలి నాని చెప్పినట్టు సమాచారం. అయితే కొడాలితో వల్లభనేని వంశీకి మంచి సంబంధాలు ఉన్నాయి.
దీంతో పాటు పేర్ని నానితో కూడా శత్రుత్వం లేదు. అంతకు ముందు వంశీకి టీడీపీలో అంత ప్రయారిటీ లేకుండా పోయింది. దీనిని మనసులో పెట్టుకున్న వంశీ ఇంకెందుకు పార్టీలో ఉండటం అనుకుని మిన్నకుండి పోయారు. గతంలో ఉన్న పవర్ రావాలంటే చేతిలో ఎమ్మెల్యే పదవి ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా నాలుగేళ్లు వెయిట్ చేసే బదులు జగన్ తో కాంప్రమైజ్ అయితే ఎలా ఉంటుందనేది కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద వంశీ జగన్ ను కలవడం ఇప్పుడు ఏపీలో వైరల్ గా మారింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి