శాంతికి దక్కిన గౌరవం..అరుదైన పురస్కారం

ఎవరూ ఊహించని విధంగా ఈసారి ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ ఆలీకి లభించింది. అగ్ర దేశం అమెరికా కూడా విస్తు పోయింది ఈ నిర్ణయంతో. ఆఫ్రికా దేశంలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు దక్కింది. ప్రధానంగా ఇథియోపియాకు సరిహద్దుల్లో ఉన్న ఎరిట్రియా దేశంతో దశాబ్దాల తరబడి నెలకొని ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల్ని అబీ అలీ తగ్గించారు. అంతే కాకుండా ఆ దేశంతో శాంతి ఒప్పందం కూడా చేసుకున్నారు. దీనిని పరిగణలోకి తీసుకుని తాము అహ్మద్ అలీని ఎంపిక చేయడం జరిగిందని ఓస్లోలోని నార్వే నోబెల్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రకటించింది. కాగా ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడం ఇదే మొదటిసారి. 43 ఏళ్ల అబీ నోబెల్‌ పురస్కారం పొందిన 100వ విజేత.

ఈ పురస్కారం కింద 90 లక్షల స్వీడిష్‌ క్రౌన్స్‌ అంటే దాదాపు 9  కోట్ల 40 లక్షలు అందనున్నాయి. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతిని పురస్కరించుకొని వచ్చే డిసెంబర్‌ 10న నార్వేలోని ఓస్లోలో శాంతి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అయితే ఈసారి తప్పకుండా స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి, 16 ఏళ్ల వయసున్న గ్రేటా థెన్‌బర్గ్‌ కు శాంతి పురస్కారం దక్కుతుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో అబీ అలీ అవార్డును గెల్చుకున్నారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. కాగా ఎన్నో ఏళ్లుగా ఇథియోపియా, ఎరిట్రియా దేశాల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూ వస్తోంది. అబీ అహ్మద్ అలీ అధికారం లోకి వచ్చాక పరిస్థితిలో మార్పు తీసుకు వచ్చారు. అంతకు ముందు తమకు స్వేచ్ఛ కావాలని కోరుతూ ఎరిట్రియా సుదీర్ఘ పోరాటం చేసి 1993లో స్వతంత్ర దేశంగా అవతరించింది.

అప్పట్నుంచి నేటి దాకా ఈ  రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.  అంతర్జాతీయ ఒప్పందాలను బేఖాతరు చేస్తూ ఎరిట్రియా 1998లో ఇథియోపియాపై సమర భేరి మోగించింది. 1998–2000 మధ్య భీకర పోరులో చివరికి ఎరిట్రియా వెనక్కి తగ్గింది. అప్పట్నుంచి ఉద్రిక్తతలు చెల రేగుతూనే ఉన్నాయి. 2018లో అబీ అహ్మద్‌ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టాక ఎరిట్రియా అధ్యక్షుడు ఇసాయిస్‌ అఫ్వెర్కికు స్నేహ హస్తం అందించారు. మూడు నెలల్లోనే ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేశంలో ప్రభుత్వ నిబంధనలన్నింటినీ అబీ అహ్మద్‌ సరళీకరించారు. కేబినెట్‌లో అత్యధికంగా మహిళల్ని అబీ అహ్మద్‌ తీసుకున్నారు. పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నవారినీ అక్కున చేర్చుకున్నారు. దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు.

పొరుగు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏళ్ల తరబడి అభద్రతలో ఉన్న ప్రజల్లో భవిష్యత్‌ పట్ల భరోసాను నింపారు. ఒక సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నతమైన దేశ ప్రధాని పదవికి ఎంపికయ్యారు. అంతకు ముందు అబీ అహ్మద్ అలీ 1995లో ర్వాండాలో ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకర్తగా సేవలు అందించారు. 2010లో రాజకీయాల్లో చేరారు. ఒరోమో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఆర్గనైజేషన్‌ సభ్యుడిగా చేరి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. 2018 ఏప్రిల్‌లో ప్రధాని పగ్గాలు చేపట్టి ఇథియోపియా దేశం దశ దిశ మార్చడానికి కృషి చేస్తున్నారు. కాగా తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కడం ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు అలీ. మన దేశానికి ఇలాంటి నాయకులు వుంటే ఎంత బావుంటుంది కదూ. హ్యాట్స్ ఆఫ్ యు ..అబీ అహ్మద్ అలీ సర్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!