మోడీకి సుప్రీం ఝలక్

బీజేపీకి కొత్త ఏడాది అంతగా వర్కవుట్ అవుతున్నట్టు లేదు. ఓ వైపు దేశమంతటా మెలమెల్లగా ప్రతికూల వాతావరణం చోటు చేసుకుంటోంది. కన్నడ నాట సక్సెస్ అయినప్పటికీ మరాఠాలో మాత్రం చిరకాల మిత్రుణ్ణి కోల్పోయింది. అంతే కాదు ఏకంగా శరద్ పవార్ చాణక్యం ముందు మోడీ, అమిత్ షాల పాచికలు పారలేదు. తాజాగా మరో షాక్ తగిలింది సుప్రీం కోర్టు ద్వారా. ఇంటర్నెట్‌ సదుపాయంపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం ఇంటర్నెట్‌ ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. వాక్‌ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ బిజినెస్‌ నిర్వహించడం ఇటీవల కాలంలో ఇంటర్నెట్‌ ద్వారా ఎక్కువగా జరుగుతోందని, ఆ సేవల్ని నిరవధికంగా నిలిపి వేయ కూడదని పేర్కొంది.

జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షల్ని వారం లోగా సమీక్షించాలని కశ్మీర్‌ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఇంటర్నెట్‌ తదితరాలపై విధించిన ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. అది ఒక వైభవోజ్వల మహా యుగం, వల్లకాటి అధ్వాన శకం, వెల్లి విరిసిన విజ్ఞానం, బ్రహ్మజెముడులా అజ్ఞానం, స్వర్గానికి రాచబాట పుచ్చుకున్న జనం నడుస్తున్నారు నరకానికి అంటూ చార్లెస్‌ డికెన్స్‌ రాసిన రెండు మహానగరాలు నవలలోని వాక్యాలను జస్టిస్‌ ఎన్వీ రమణ తన తీర్పులో ఉటంకించారు. భూతల స్వర్గంగా కశ్మీర్‌ మన హృదయాల్లో నిలిచినప్పటికీ, ఈ అందమైన ప్రాంతపు చరిత్ర హింస, తీవ్రవాదంతో కూడుకొని ఉంది అని వ్యాఖ్యానించారు.

పౌరుల స్వేచ్ఛను, వారి భద్రతను సమతుల్యం చేయడమే కోర్టుల పని అని ఆయన పేర్కొన్నారు. భావప్రకటనా స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని చేపట్టే స్వేచ్ఛ, ఇంటర్నెట్‌ ఆధారంగా జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1), ఆర్టికల్‌ 19(1)(జీ) రక్షణ కల్పిస్తోందని జస్టిస్‌ ఎన్వీ రమణ తన 130 పేజీల తీర్పులో పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 144వ సెక్షన్‌ ద్వారా జారీ చేసే ఉత్తర్వులు ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తాయని, వాటిపై నిరవధికంగా ఉక్కుపాదం మోపకూడదని ధర్మాసనం పేర్కొంది. ఈ అధికారాన్ని అతిగా వినియోగిస్తే అక్రమాలకు దారితీస్తుందని పేర్కొంది. అత్యవసర సేవలైన ఆసుపత్రులు, విద్యా సంస్థలతో పాటుగా ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఈ బ్యాంకింగ్‌ రంగంలో ఇంటర్నెట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించింది. 

ఇంటర్నెట్‌ సౌకర్యం ప్రాథమిక హక్కు అని..వ్యాఖ్యా నించింది. ఇంటర్నెట్‌ సదుపాయం ప్రజల ప్రాథమిక హక్కు అని తేల్చి చెప్పడం ద్వారా సుప్రీంకోర్టు మోదీ సర్కార్‌కు గట్టి ఝలక్‌ ఇచ్చిందని కాంగ్రెస్‌ పేర్కొంది. ప్రజల అసమ్మతి జ్వాలల్ని నిషేధాజ్ఞల ద్వారా ఎక్కువ కాలం తొక్కి పెట్టి ఉంచలేరని కాంగ్రెస్‌ నాయకుడు రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ట్వీట్‌ చేశారు. మోదీ సర్కార్‌ చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సుప్రీం తీర్పు ద్వారా 2020లో తొలి దెబ్బ తగిలిందన్నారు. మొదటిసారిగా సుప్రీంకోర్టు కశ్మీర్‌ ప్రజల మనోభావాలపై మాట్లాడిందని కాంగ్రెస్‌ ఎంపీ గులాం నబీ ఆజాద్‌ అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!