దుమ్ము రేపిన కుర్రాళ్ళు

నిన్నటి దాకా కుర్రాళ్లే అని తీసి పారేసిన వాళ్లంతా విస్తు పోయేలా ఉన్నట్టుండి భారీ వేతనాలతో ఆఫర్ లెటర్స్ తీసేసుకుంటున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ల్లో మన పిల్లల కోసం విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. ఉత్తర అమెరికా, యూరప్, సింగపూర్, జర్మనీ, జపాన్‌ వంటి దేశాలు ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల విద్యార్థులను నియమించుకునేందుకు పోటీ పడ్డాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థుల కోసం గత ఏడాది 26 విదేశీ కంపెనీలు బారులు తీరగా ఈ సీజన్‌లో ఏకంగా 51 విదేశీ కంపెనీలు నియామకాలు చేపట్టాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బీహెచ్‌యూ, ఐఐటీ గువాహటిలలో ఒక్కో విద్యార్థికి సగటున ఐదు ఆఫర్లు లభించాయి.

ఇదిలా ఉండగా ఐఐటీ హైదరాబాద్‌ ఉద్యోగ నియామకాల్లో కొన్ని ఐఐటీలను దాటి పోయింది. ఈ విద్యా సంవత్సరం బీటెక్‌ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించు కునేందుకు 38 అంతర్జాతీయ కంపెనీలు అడుగుపెట్టాయి. ఐఐటీ మద్రాస్‌లో 34 , ఐఐటీ కాన్పూర్‌ లో 22, ఐఐటీ వారణాసిలో 11, ఐఐటీ గువాహటి లో 25 మంది ఎంపిక కాగా అన్ని ఐఐటీల కంటే హైదరాబాద్‌ ఐఐటీ ఇంటర్ నేషనల్ కంపెనీలను ఆకర్షించడంలో టాప్ పొజిషన్ లో ఉంది. అయితే ఈసారి ఐఐటీ విద్యార్థులకు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఆఫర్‌ చేసిన అంతర్జాతీయ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, ఉబర్, పేపాల్‌తోపాటు యాక్సెంచర్‌ జపాన్, డెస్కెరా, హనీవెల్‌ వంటివి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌ 100 మందికి పైగా విద్యార్థులకు కోటి అంతకంటే ఎక్కువ వేతనం తో ఆఫర్‌ చేచేసింది.

ఉబర్, పేపాల్‌ వంటి అమెరికన్‌ కంపెనీలు తక్కువ సంఖ్యలో విద్యార్థులను నియమించు కున్నప్పటికీ కనిష్టంగా 60 లక్షలు, గరిష్టంగా కోటి మేర వేతనాలను ఆఫర్‌ చేయడం విశేషం. ఈ ఏడాది ఇప్పటి దాకా జరిగిన నియామకాల్లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థుల్లో 60 శాతం మందికి అంతర్జాతీయ కంపెనీలు ఆఫర్లు ఇచ్చాయి. ఈ ఉద్యోగాలు దక్కించుకున్న వారంతా అమెరికా, సింగపూర్, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే ఉద్యోగాలు దక్కాయి. ఇలా ఉద్యోగాలు పొందిన వారికి సంబంధిత కంపెనీలే వర్క్‌ పర్మిట్‌ ఇచ్చి తీసుకుంటాయి. అంతర్జాతీయ కంపెనీలు ఈసారి ఐఐటీ ఖరగ్‌పూర్‌ వైపు పరుగులు తీశాయి.

ఈ విద్యా సంవత్సరం బీటెక్‌ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించు కునేందుకు 51 కంపెనీలు నియామక ప్రక్రియను పూర్తి చేశాయి. ఐఐటీ బాంబేలో తుది దశ నియామకాల ప్రక్రియ పూర్తయితే గానీ ఈ ఏడాది అంతర్జాతీయ కంపెనీలు ఏ ఐఐటీని ఎక్కువగా సందర్శించాయన్న వివరాలు లభించవు. కాగా ప్రాథమిక సమాచారం మేరకు ఖరగ్ పూర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా రెండో ప్లేస్ లో హైదరాబాద్ ఐఐటీ నిలిచింది. ఇప్పటి వరకు 38 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇంత భారీ ఎత్తున ఎంపిక కావడం విశేషం. ఇంకా ఎంత మంది సెలెక్ట్ అవుతారో వేచి చూడాలి. ఈ మొత్తం ఎంపిక ప్రక్రియలో మైక్రో సాఫ్ట్ , ఉబర్, పేపాల్, యాక్సెంచర్‌, డెస్కెరా, హనీవెల్‌ కంపెనీలు ఉన్నాయి. మన కుర్రాళ్ళు మహా గట్టోళ్ళని నిరూపించారు.

కామెంట్‌లు