పద్మ అవార్డులకు హిమదాస్ సరి పోదా..?

ఈ దేశంలో కాకుండా చైనాలోనో లేదా అమెరికాలో పుట్టి వుంటే మట్టినే నమ్ముకున్న హిమ దాస్ ను ఆకాశానికి ఎత్తేసేవారు. సమున్నతంగా సత్కరించే వారు. ఎందుకంటే ఇక్కడ కులాలు, మతాల సమీకరణాల ప్రాతిపదికన పతకాలు పంచబడతాయి. అవార్డులు ఇవ్వబడతాయి.130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో వేలాది మంది మాత్రమే క్రీడాకారులుగా వెలుగులోకి వస్తున్నారు. ఇంకా లక్షలాదిగా అవకాశాల కోసం వేచి చూస్తున్నారు. ఇక్కడ ఉన్నన్ని రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు ఇంకెక్కడా కనిపించవు. ఇక్కడ మీడియా కూడా  బడా బాబులకు , కంపెనీలకు వత్తాసు పలుకుతున్నాయి. వారిచ్చే బిస్కెట్స్ కోసం ఆహా ఓహో అంటూ ప్రచారం చేస్తున్నాయి. పీవీ సింధు కంటే ముందే హిమ దాస్ అయిదు బంగారు పథకాలు సాధించింది. కానీ ఆమె పేరు ఎక్కడా అగుపించలేదు. ఏదో ఓ చిన్న మూలన పది లైన్లు రాశారు. ఇదీ సమున్నత భారతం. ఇదీ మోడీ సర్కార్ చూపిస్తున్న ఔదార్యం.

ఈ భూమి నాకు ఎంతో ఇచ్చింది. నేను ఎదుర్కున్న కస్టాలు, ఇబ్బందులు ఏవీ నా పట్టుదలకు అడ్డంకి కాలేక పోయాయి. నా ముందు ఒక్కటే మిగిలి ఉన్నది. అది నాకు, నా కన్నవారికి జన్మను ఇచ్చి, సమాజంలో గుర్తింపు కలుగజేసిన నా భారత దేశం మాత్రమే నా కళ్ళ ముందు నిలిచింది. నా కాళ్ళు, కళ్ళు అన్నీ మువ్వొన్నెల పతాకాన్ని గుర్తుకు తెచ్చుకునేలా చేశాయి. అదే నేను విజయం సాధించేలా చేశాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి అర్ధరాత్రి పడుకునేంత దాకా బూతు బొమ్మలు, సినిమాలు, చూస్తూ చాటింగ్, చీటింగ్ చేస్తూ..ఇక్కడ చదువుకుని అమెరికా జపం చేస్తున్న ప్రబుద్ధులు హిమ దాస్ ను చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది. కార్పొరేట్ కంపెనీలు ఆమె వైపు చూడలేదు. పట్టించు కోలేదు కూడా. వాళ్లకు అందం కావాలి. సామాజిక సమీకరణాల్లో తనను ప్రమోట్ చేసే వాళ్ళు కావాలి. కానీ హిమ దాస్ కు ఇవేవీ లేవు. చిరుత పులిలా పోరాడింది. తానేమిటో ఈ ప్రపంచానికి తెలియ చేసింది. అమెరికా లాంటి దేశాలు ఎవరీ హిమ దాస్ అంటూ విస్తు పోయేలా చేసింది.

హిమదాస్ అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలు పెట్టిన 18 నెలలలోనే ఈ విజయం సాధించింది. 19 ఏళ్ల హిమదాస్‌ అసోం లోని నాగయోన్‌ జిల్లాలోని ఢింగ్‌ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించింది. తండ్రి రొంజిత్ దాస్ ,తల్లి జొనాలి దాస్. కుటుంబంలోని నలుగురు పిల్లలలో హిమదాస్ చివరిది. ఆమె తండ్రి స్థానికంగా వరి పండించే రైతు. చిన్నతనం నుండీ క్రీడలపై ఆసక్తి ఎక్కువ హిమ దాస్ కు. తండ్రితో పాటు పొలం పనికి వెళ్ళింది. బడిలో ఉండగానే ఫుట్ బాల్ ఆడటం ప్రారంభించింది. తన పరుగును గోల్ పోస్ట్ నుండి ట్రాక్ మీదకు మార్చుకుంది. నవోదయ విద్యాలయం కు  చెందిన  ట్రైనర్ సాంసుల్ హోక్వ్ సలహాతో తక్కువ దూరం రేసుల్లో పరుగెత్తడం స్టార్ట్ చేసింది.

హోక్వ్ హిమదాస్ ను నాగోన్ స్పోర్ట్స్ అసోషియేషన్ కు  చెందిన శంకర్ రోయ్ కు పరిచయం చేశాడు. ప్రపంచంలో అందరి కంటే వేగంగా..కేవలం చిన్న వయసులో ప్రపంచాన్ని జయించింది. భారతదేశ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు సగర్వంగా ఎగరవేసింది. నిపోన్‌దాస్‌ అనే కోచ్ దొరకటంతో ఆమె తన లోని ఆటకు మెరుగులు దిద్దుకుంది. ఆమె విజయకాంక్షకు అనుగుణంగా నిపోన్‌దాస్‌ రూపంలో స్ఫూర్తిని ఇచ్చే గురువు దొరికాడు. జిల్లా స్థాయి పోటీలలో చౌకరకం దుస్తులు, షూలతోనే 100 మీటర్లు, 200 మీటర్లులో బంగారు పతకాలు పొంది జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచేలా చేసింది హిమ దాస్. అదే సమయంలో అంతర్ జిల్లా పోటీకి ఎంపికై రెండు స్వర్ణాలు దక్కించుకుంది. హిమదాస్ తల్లి దండ్రులను ఒప్పించి అమెను గౌహతికి తీసుకెళ్లాడు ట్రైనర్. అద్దె ఇంట్లో ఉంటూ ట్రై చేసింది. కానీ సమయం సరిపోక పోవడంతో హిమ దాస్ ను జాయ్ స్పోర్ట్స్ కాంప్లెక్సు హాస్టల్ లో చేర్పించాడు.100 మరియు 200 మీటర్ల పరుగు పందెంలొ మెరుపులు మెరిపించిన హిమను  నిపన్ , మరో కోచ్ నవ జీత్ లు 400 మీటర్ల కేటగిరికి మార్చారు. 2018 మార్చిలో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ లో హిమ పాల్గొన్నది.

400 మీటర్ల ఫైనల్లో అమె 51.32 సెకన్లలో చేరి ఆరవ స్థానంలో నిలిచింది. ఇదే ఏడాది జూన్ లో జరిగిన అంతర్ రాష్ట్ర ఛాంపియన్ షిప్ పోటీల్లో 400 మీటర్ల దూరాన్ని 51.13 సెకన్లలో చేరింది. ఫిన్ లాండ్ లోని టంపెరెలో జులై 2018 న జరిగిన ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన హిమదాస్ తొలి స్వర్ణం సాధించిన భారతీయురాలిగా ఘనత సాధించింది. 400 మీటర్ల ఫైనల్లో 51.46 నిమిషాల్లో గమ్యం చేరి  బంగారు పతకం అందుకుంది. 4వ నెంబరు లైనులో పరుగు పెట్టిన హిమదాస్‌ రుమేనియాకు చెందిన ఆండ్రియా మిక్క్లోస్‌ కన్నా మొదట వెనక పడింది. 50 నుండి 100 మీటర్ల మధ్యలో ఆండ్రియాతో వెనక బడిన హిమదాస్‌ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ సెర్మనీ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమదాస్ ఆనంద భాష్పాలను రాల్చింది. జ‌న‌గ‌ణ‌మ‌న‌ వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపు కోలేక పోయింది.

మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది మిమ్మల్ని కదిలించక పోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించ లేదని ఆయన తన ట్యాగ్‌ లైన్‌లో పేర్కొన్నారు. భారత దేశ రాష్ట్రపతి హిమ దాస్ ను చూసి గర్విస్తున్నాని తెలిపారు. కర్ణాటకకు చెందిన  పరమేశ్వర హిమదాస్ కు 10 లక్షల నగదు బహుమతి ప్రకటించాడు. ఎన్నో కస్టాలు అనుభవించి దేశానికి పేరు తీసుకు వచ్చిన హిమ దాసుకు కేంద్రంలోని క్రేడా మంత్రిత్వ శాఖ కనీసం పద్మశ్రీ అవార్డుతో సత్కరించాలని దేశంలోని క్రీడాభిమానులు కోరుతున్నారు. హిమ దాస్ పరుగుల రాణి కాదు ..ఆమె ఈ దేశానికి రాణి. తన స్వశక్తితో, పట్టుదలతో జాతి గర్వించేలా పోరాడింది..చిరుతలా పరుగులు తీసింది. బంగారు పతాకాన్ని ముద్దాడింది. ఈ దేశం జెండాను చూసి కన్నీళ్లు కార్చింది. ఇదీ సిసలైన క్రీడా స్ఫూర్తి అంటే. 

కామెంట్‌లు