అవార్డుల రేసులో మేరీ, పీవీ..హిమ ఎక్కడ..?

భారత దేశంలో క్రీడాకారులకు కొదువ లేదు. కాకపోతే రాజకీయాలు ఎక్కువ. ఏ దేశంలో లేని రీతిలో ఇక్కడ పవర్ పాలిటిక్స్ ట్రిక్స్ ప్లే చేస్తాయి. మొత్తం రాజకీయాలను పక్కన పెడితే ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఏదైనా ఉందంటే అది బీసీసీఐ మాత్రమే. అది ఎవ్వరి మాటా వినదు. దానిపై పెత్తనం చెలాయించాలని మోడీ అండ్ పరివారం చూసినా కుదరడం లేదు. ఇక ప్రతి ఏటా ఇచ్చే అత్యున్నత క్రీడా పురస్కారాలు ఎవరెవరికి దక్కుతాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. వీటి ఎంపికపై పలు ఆరోపణలు వచ్చాయి. ఇక తెలంగాణ, ఏపీ ల గురించి చెప్పాల్సిన పని లేదు. ప్లేయర్స్ ఉత్తమంగా భావించే పద్మ భూషణ్ , పద్మ విభూషణ్, పద్మశ్రీ , తదితర పురస్కారాలను త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ఇక ప్రపంచ ఛాంపియన్ షిప్ లో బంగారు పతాకాన్ని సాధించిన పీవీ సింధుకు పద్మ భూషణ్ ఇవ్వాలని క్రేడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.

రెండో అత్యున్నతమైన అవార్డుగా భావించే పద్మవిభూషణ్‌కు ఆరుసార్లు ప్రపంచ విజేత, బాక్సింగ్‌ క్వీన్‌ మేరీకోమ్‌ పేరును అవార్డుల కమిటీకి సిఫారసు చేసింది. పద్మశ్రీ అవార్డుకు అర్హులుగా మరో తొమ్మిది మంది క్రీడాకారుల పేర్లను పంపింది. వీరిలో ఏడుగురు మహిళలే ఉండడం విశేషం. అవార్డు విజేతలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ తొలిసారి ఓ మహిళా అథ్లెట్‌ను సిఫారసు చేయడం విశేషం. 2013లో పద్మభూషణ్‌ పొందిన మేరీకోమ్‌.. 2006లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది. ఇక.. భారతరత్న, పద్మవిభూషణ్‌ తర్వాత మూడో అత్యున్నత అవార్డు అయిన పద్మభూషణ్‌కు పీవీ సింధును నామినేట్‌ చేసింది. ఒలింపిక్‌ రజత పతక విజేత సింధు పేరును 2017లోనే పద్మభూషణ్‌కు సిఫారసు చేశారు. కానీ తుది జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు.

2015లో ఈ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఇక ఆర్చర్‌ తరుణ్‌దీప్‌ రాయ్‌, హాకీ ఒలింపియన్‌ , క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, జాతీయ మహిళా హాకీ జట్టు కెప్టెన్‌ రాణీ రాంపాల్‌, మాజీ షూటర్‌ సుమ షిరుర్‌, పర్వతారోహ సోదరీమణులు తషి, నుంగ్షీ మాలిక్‌ల పేర్లను పద్మశ్రీకి సిఫారసు చేసింది. ఈ జాబితాకు క్రీడల మంత్రి కిరణ్‌ రిజుజు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఆ తర్వాత అవార్డుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాక.. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్బంగా పద్మ అవార్డుల విజేతల పేర్లను ప్రకటించనున్నారు. మొత్తం మీద అయిదు బంగారు పథకాలు సాధించి దేశం పేరును నిలబెట్టిన హిమ దాస్ ను మరిచి పోవడంపై క్రీడాభిమానులు మండి పడుతున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!