దుమ్ము రేపిన బెంగ‌ళూరు - త‌ల‌వంచిన పంజాబ్

ఒకానొక ద‌శ‌లో ఐపీఎల్ టోర్న‌మెంట్ నుండి వైదొల‌గి పోతుందుని అనుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జ‌ట్టు హ్యాట్రిక్ విజ‌యాల‌ను స్వంతం చేసుకుంది. ప్లే ఆఫ్ ఆశ‌ల‌పై న‌మ్మ‌కం పెట్టుకుంది. వ‌రుస పెట్టి ఆరు అప‌జ‌యాల‌ను మూట‌గ‌ట్టుకున్న కోహ్లి సేన అనూహ్యంగా పుంజుకుంది. ఇంకా పోరాటం కొన‌సాగిస్తూనే ఉన్న‌ది. టోర్నీ ప్రారంభం నుండి తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న కోహ్లి మెల మెల్ల‌గా జ‌ట్టును స‌క్సెస్ బాట‌లోకి తీసుకు వ‌చ్చాడు. రోజు రోజుకు ఆట‌తీరును మెరుగు ప‌ర్చుకుంటూనే మిణుకు మిణుకుమంటున్న ప్లేఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంటూ సాగుతోంది. ఆ జ‌ట్టు ఆట‌గాడు డివిలియ‌ర్స్ రెచ్చి పోవ‌డంతో పంజాబ్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించింది.

డివిల‌య‌ర్స్ 44 బంతులు ఆడి మూడు ఫోర్లు ఏడు భారీ సిక్స‌ర్ల‌తో 82 ప‌రుగులు చేశాడు. జ‌ట్టు స్కోర్ లో కీల‌క భూమిక పోషించాడు. మ‌రో కీల‌క ఆట‌గాడు పార్థివ్ ప‌టేల్ 24 బంతులు మాత్ర‌మే ఆడి ఏడు ఫోర్లు, రెండు క‌ళ్లు చెదిరే సిక్స‌ర్ల‌తో 44 ప‌రుగులు చేసి పంజాబ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. 17 ప‌రుగుల తేడాతో బెంగళూరు జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. వీరిద్ద‌రితో పాటు స్టాయినిస్ ఆఖ‌రులో అద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించాడు. 34 బంతులు ఆడి రెడు ఫోర్లు మూడు సిక్స‌ర్లతో 46 ప‌రుగులు చేశాడు. నాలుగు వికెట్లు కోల్పోయి 202 ప‌రుగులు చేసింది. ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో మైదానంలోకి దిగిన పంజాబ్ జ‌ట్టు 7 వికెట్లు కోల్పోయి 185 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. కే ఎల్ రాహుల్ 27 బంతులు ఆడి ఏడు ఫోర్లు , ఒక సిక్స‌ర్‌తో 42 ప‌రుగులు చేయ‌గా మ‌యాంక్ అగ‌ర్వాల్ 21 బంతులు ఆడి ఐదు ఫోర్లు , ఒక సిక్స‌ర్‌తో 35 ప‌రుగులు చేశాడు.

పూర‌న్ ఆఖ‌రులో గెలిపించేందుకు నానా తంటాలు ప‌డ్డాడు. 28 బంతులు ఆడిన ఈ క్రికెట‌ర్ ఒక ఫోర్, అయిదు భారీ సిక్స‌ర్లు బాది 46 ప‌రుగులు చేశాడు. ఈ స‌మ‌యంలో పూర‌న్ క్రీజులో ఉన్నంత సేపు బెంగ‌ళూరు బౌల‌ర్లు, కెప్టెన్ కోహ్లి ఇబ్బంది ప‌డ్డారు. పంజాబ్ జ‌ట్టుకు ఆరంభంలోనే అదిరి పోయేలా ప‌రుగులు సాధించారు. క్రిస్ గేల్, రాహుల్‌లు. బౌండ‌రీల మోత మోగించ‌డంతో ఆ జ‌ట్టు మూడు ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి 36 ప‌రుగులు చేసింది. మంచి ఊపు మీదున్న స‌మ‌యంలో గేల్ ను ఉమేష్ యాద‌వ్ వెన‌క్కి పంపించాడు. రాహుల్, మ‌యాంక్ లు ఇద్ద‌రూ మ‌రో వికెట్ పోకుండా కాపాడుకుంటూనే..బెంగ‌ళూరు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 100 ప‌రుగులు చేశారు.

ల‌క్ష్యం భారీగా ఉన్నా ..వీరిద్ద‌రి ఆట తీరుతో పంజాబ్ గెలుపు అంచుల దాకా వ‌చ్చింది. కానీ గెల‌వ‌లేక పోయింది. జోరుమీదున్న వీరిద్ద‌రు నాలుగు ప‌రుగుల తేడాలో పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. స్టాయినిస్, ఆలీలు చ‌క్క‌టి బౌలింగ్ చేశారు. వీరు వెళ్లాక ..ప‌రుగుల వేగం త‌గ్గింది. మిల్ల‌ర్ ఒక్క‌డే 25 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల‌తో 24 ప‌రుగులు చేశాడు. పూర‌న్ రంగంలోకి దిగాక సీన్ మారింది. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో చెల‌రేగి పోయాడు. కానీ పంజాబ్‌కు విజ‌యాన్ని అందించ‌లేక పోయాడు. మొత్తం మీద కోహ్లి సేన మెల మెల్ల‌గా కోలుకుంటోంది.

కామెంట్‌లు