టాటా తీరుపై మిస్త్రీ ఆగ్రహం

టాటా సంస్థలు తనపట్ల అనుసరిస్తున్న తీరుపై మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిస్త్రీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టాటా సన్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా తన నియామకాన్ని పునరుద్ధరిస్తూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ తీసుకున్న నిర్ణయం, తనను చట్ట విరుద్ధంగా తొలగించిన విధానంతో పాటు, తనను రతన్‌ టాటా ఇతర ట్రస్టీలు అణిచివేతకు గురిచేసిన తీరును గుర్తించిందని సైరస్‌ మిస్త్రీ వ్యాఖ్యానించారు. ఎన్‌క్లాట్‌ ఉత్తర్వులు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ సహా, టీసీఎస్‌, టాటా టెలీసర్వీసెస్‌, టాటా ఇండస్ర్టీస్‌లో డైరెక్టర్‌ పదవుల కోసం పాకులాడటం లేదని స్పష్టం చేశారు. మరోవైపు సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ చీఫ్‌గా పునరుద్ధరిస్తూ ఎన్‌క్లాట్‌ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ టాటా గ్రూప్‌ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఎన్‌క్లాట్‌ ఉత్తర్వులు టాటా గ్రూపు కంపెనీల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌తో పాటు సంస్థలో దశాబ్ధాల తరబడి నెలకొన్న విధానాలను దెబ్బతీసేలా ఉన్నాయని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సంస్థ పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీ తీర్పును సవాల్‌ చేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని టాటా సన్స్‌ కోరుతోంది. మరి​కొన్ని రోజుల్లో టీసీఎస్‌ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో దీనిపై తక్షణమే స్టే తెచ్చు కోవాలని సంస్థ భావిస్తోంది. అయితే ఇటీవలి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి వాదనలు విననుందని అంచనా. మరోవైపు ఈ నెలలోనే బోర్డు సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా మిస్త్రీ వ్యవహారంపైనే చర్చ జరగనుంది.

టాటా సన్స్‌ అప్పీల్‌ను సైరస్‌ మిస్త్రీ, అతని కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని..ఎన్‌సీఎల్‌ఏటీ నిర్ణయాన్ని అమలు చేయాలని సైరస్‌ కుటుంబం డిమాండ్‌ చేయవచ్చని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రతి క్వార్టర్‌ ఫలితాలు విడుదల చేయడానికి కంపెనీలకు 45 రోజుల సమయం ఉంటుందని, టాటా సన్స్‌కు ఫిబ్రవరి వరకు సుప్రీం నిర్ణయం కోసం వేచి చూసే అవకాశం ఉందని ఎస్‌అండ్‌ఆర్‌ అసోసియేట్స్‌ ప్రతినిథి పేర్కొన్నారు. టాటా సన్స్ 2016 లో మిస్త్రీని ఛైర్మన్‌గా తొలగించి, కొన్ని నెలల తరువాత  చంద్రశేఖరన్‌ను నియమించింది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ చైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కామెంట్‌లు