ధోని..మిథాలీలకు బిసిసిఐ షాక్
సుదీర్ఘ కాలం పాటు దేశానికి తమ ఆట ద్వారా ఎన్నో మరుపురాని విజయాలను అందించిన మాజీ సారధులు మహేంద్ర సింగ్ ధోని, మిథాలీ రాజ్ లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఘోరంగా అవమానించింది. వారి గెలుపుల్ని పరిగణలోకి తీసుకోలేదు. రాబోయే ఏడాది కాలానికి కొత్తగా వార్షిక కాంట్రాక్ట్లను ప్రకటించింది. 27 మందితో రూపొందించిన ఈ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చోటు దక్కలేదు. గత జులైలో ప్రపంచ కప్ సెమీ ఫైనల్ తర్వాత భారత్కు ప్రాతినిధ్యం వహించని ధోని భవిష్యత్తుపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబరు వరకు ఈ కాంట్రాక్ట్ వర్తిస్తుంది. టాప్ గ్రేడ్ అయిన ‘ఎ ప్లస్’లో ఎప్పటిలాగే ముగ్గురు క్రికెటర్లు కోహ్లి, రోహిత్, బుమ్రాలకే అవకాశం దక్కింది. టాపార్డర్ బ్యాట్స్మన్ లోకేశ్ రాహుల్ ఇటీవల నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
దీంతో అతడిని ‘బి’ గ్రేడ్ నుంచి ‘ఎ’ గ్రేడ్లోకి ప్రమోట్ చేశారు. టెస్టు ఓపెనర్గా తన స్థానం సుస్థిరం చేసుకున్న మయాంక్ అగర్వాల్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా ‘సి’నుంచి ‘బి’లోకి వచ్చారు. ముగ్గురు ఆటగాళ్లు అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ఖలీల్ అహ్మద్ తమ కాంట్రాక్ట్లు కోల్పోయారు. కొత్తగా సైనీ, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్లకు తొలిసారి గ్రేడ్ ‘సి’ కాంట్రాక్ట్ దక్కింది. గత అక్టోబరు నుంచి ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వచ్చే సెప్టెంబరులోగా ఆడతాడనే నమ్మకం లేదు. ఒక వేళ ఐపీఎల్లో అద్భుతంగా ఆడి టి20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చినా ఆ టోర్నీ అక్టోబరులో ఉంది. కాబట్టి నిబంధనల ప్రకారం చూస్తే ధోనికి కాంట్రాక్ట్ అర్హత లేదు. ఈ విషయంపై మాజీ కెప్టెన్కు ముందే సమాచారం ఇచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. స్వయంగా గంగూలీయే దీనిని చెప్పినట్లు తెలుస్తోంది.
5 కోట్ల విలువ గల కాంట్రాక్ట్లో చోటు కోల్పోయిన రోజే ధోని మైదానంలోకి దిగడం విశేషం. తన స్వస్థలం రాంచీలో జార్ఖండ్ జట్టు రంజీ జట్టు సభ్యులతో కలిసి అతను ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. బ్యాటింగ్తో పాటు రెగ్యులర్ ట్రైనింగ్లో కూడా అతను భాగమైనట్లు జార్ఖండ్ టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ప్రత్యేక బౌలింగ్ మెషీన్ ద్వారా అతను సాధన చేయడం విశేషం. రంజీ ఆటగాళ్లంతా ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేస్తే ధోని మాత్రం తెల్ల బంతితో ఆడాడు. తద్వారా పోటీ క్రికెట్ కోసం తాను సిద్ధమవుతున్నట్లు మహి పరోక్షంగా చూ పించాడు. ఐపీఎల్తోనే పునరాగమనం చేయవచ్చు. ఎ ప్లస్ 7 కోట్లు కేటగిరీలో కోహ్లి, రోహిత్, బుమ్రాలకు చోటు దక్కగా , ఎ కేటగిరి కింద 5 కోట్ల జాబితాలో అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, ధావన్, షమీ, ఇషాంత్, కుల్దీప్, పంత్, రాహుల్ లను ఎంపిక చేసింది.
ఇక బి విభాగం కింద 3 కోట్ల కేటగిరిలో ఉమేశ్, చహల్, పాండ్యా, సాహా, మయాంక్ ఉండగా సి కేటగిరీలో జాదవ్, మనీశ్ పాండే, విహారి, సైనీ, దీపక్ చాహర్, శార్దుల్, అయ్యర్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. మరో వైపు బిసిసిఐ మహిళల జట్టు కు ఎనలేని సేవలందించిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మిథాలీ రాజ్ దిగువకు పడి పోయింది. ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్లో ఉన్న ఆమెను ‘బి’ గ్రేడ్లోకి మార్చారు. టి20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం మిథాలీ ఒకే ఫార్మాట్లో ఆడుతోంది. ‘ఎ’ గ్రేడ్లో టి20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ , ఓపెనర్ స్మృతి మంధాన తమ స్థానాలు నిలబెట్టుకోగా, కొత్తగా లెగ్స్పిన్నర్ పూనమ్ యాదవ్కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఇటీవల భారత్ విజయాల్లో పూనమ్ కీలక పాత్ర పోషించింది.
రాధ యాదవ్, తాన్యా భాటియాలకు ‘సి’ గ్రేడ్నుంచి ‘బి’లోకి ప్రమోషన్ లభించగా, 15 ఏళ్ల షఫాలీ శర్మకు తొలిసారి కాంట్రాక్ట్ దక్కింది. మహిళల జట్టు కాంట్రాక్ట్లు కూడా 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబర్ వరకు వర్తిస్తాయి. ఇక గ్రేడ్ ల వారీగా చూస్తే ‘ఎ’ గ్రేడ్ కింద 50 లక్షలు పొందిన ఆటగాళ్లలో హర్మన్, స్మృతి, పూనమ్ యాదవ్ ఎంపిక కాగా ‘బి’ విభాగం కింద 30 లక్షలు పొందిన వారిలో మిథాలీ, ఏక్తా బిష్త్, జులన్, శిఖా పాండే, దీప్తి శర్మ, జెమీమా, తాన్యా, రాధ ఉన్నారు. ఇక ‘సి’ కేటగిరి కింద 10 లక్షలు పొందిన జాబితాలో హేమలత, అనూజ, వేద, మాన్సి, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి, పూజ, హర్లీన్, ప్రియ పూనియా, పూనమ్ రౌత్, షఫాలీ వర్మ ఉన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి