కన్నీటి పర్యంతమైన కుమార
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కుమార స్వామి మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన తన దుఃఖాన్ని ఆపు కోలేక పోయారు. తన భావోద్వేగాలను ఆపుకోలేక పోవడం ఇదే మొదటిసారి కాదు. చాలా సార్లు ఆయన ఏడుపును నిలువరించలేక పోతున్నారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కన్నడ నాట వైరల్ గా మారారు. మండ్యా జిల్లాలో ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కృష్ణరాజపేటె అసెంబ్లీ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి బీఎల్ దేవరాజ్ తరఫున కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నా కుమారుడిని ఎన్నికల బరిలో నిలపాలని అనుకోలేదు. మండ్యా ప్రజలే అతన్ని ఎన్నికల్లో నిలపమని కోరారు.. కానీ వారే అతనికి మద్దతు ఇవ్వలేదు.. ఇది నన్ను చాలా బాధించింది. నా కొడుకు ఎందుకు ఓడి పోయాడో అర్థం కావడంలేద’ని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటిని ఆపు కోలేక పోయారు. అలాగే తనకు రాజకీయాలు అవసరం లేదని.. ప్రజల ప్రేమని మాత్రమే కోరుకుంటున్నట్టు చెప్పారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఈ ఉప ఎన్నికల్లో కనీసం 8 స్థానాలు గెల్చుకోవాలి. డిసెంబర్ 9వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో మండ్యా లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్.. సినీ నటి సుమలత చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో కూడా పలుమార్లు కుమారస్వామి ప్రజలతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇది కూడా ఓ చరిత్రగా మిగిలి పోవడం కన్నడ నాట విశేషం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి