అజిత్ కు అమిత్ ఝలక్
ఎన్సీపీలో తిరుగుబాటు తెచ్చి బీజేపీతో జట్టు కట్టి.. ఆదరా బాదరాగా ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ పదవీ స్వీకార ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులను సాకుగా చూపి బీజేపీ అజిత్ను తమ వైపు తిప్పుకున్నట్టు కథనాలు వచ్చాయి. అజిత్తో కలిసి దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక, ఈ కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
70 వేల కోట్ల ఇరిగేషన్ స్కామ్ కేసులో అజిత్ పవార్కు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. బీజేపీకి మద్దతు నిచ్చినందుకు ప్రతిఫలంగా ఆయనను కేసుల నుంచి విముక్తి కల్పించినట్టు ఆరోపణలు కూడా గుప్పు మన్నాయి. అజిత్పై ఏసీబీ కేసుల ఎత్తివేత మీద శివసేన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే, శరద్ పవార్ చాణక్యం ముందు ఫడ్నవిస్ ప్రభుత్వం, నిలదొక్కు కోలేక పోయిన విషయం తెలిసిందే. ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు లేక పోవడం, పవార్ కుటుంబ సభ్యులు సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు చేయడంతో అజిత్ ఎట్టకేలకు దిగివచ్చి.. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు.
దీంతో బీజేపీ ప్రభుత్వం పడి పోయింది. తిరిగి ఆయన ఎన్సీపీ గూటికి చేరుకున్నారు. పార్టీలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అవినీతి కేసుల విషయంలో అజిత్కు క్లీన్చిట్ ఇవ్వ లేదంటూ షాక్ ఇచ్చారు. కేసులు ఎత్తి వేయ లేదని ఆయన స్పష్టం చేశారు. అజిత్ పవార్ వెంట బీజేపీ నడవదని, బీజేపీ వెంటే అజిత్ వస్తారని అమిత్ షా జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ కేబినెట్లో అజిత్ చేరినా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి