కేకేఆర్ పై గంభీర్ గరం గరం
సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా వుండే భారతీయ క్రికెట్ ఆటగాళ్లలో మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఒకడు. మరొకరు తన మాటలతో, డిఫరెంట్ మేనరిజం తో దేశాన్ని ఊపేసే మరో మాజీ ఆటగాడు, పాకిస్తాన్ దేశాధినేత ఇమ్రాన్ స్నేహితుడు సిద్దు ఒకరు. వీరు ఏదో రకంగా తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచు కోవడం అలవాటు. తాజాగా గౌతమ్ గంభీర్ కేకేఆర్ పై ఘాటు కామెంట్స్ చేశాడు. పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ను అత్యధిక ధరకు సొంతం చేసుకున్న కోల్కతా నైట్రైడర్స్ జట్టు మేనేజ్మెంట్ నిర్ణయాన్ని గంభీర్ తప్పు బట్టాడు. ఓ బౌలర్ కోసం భారీ మొత్తం చెల్లించడం సరికాదని అభిప్రాయ పడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 కోసం జరిగిన వేలంలో ఆసీస్ పేస్ బౌలర్ కమిన్స్ను ఏకంగా 15 కోట్ల 50 లక్షలకు కేకేఆర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఒక విదేశీ ఆటగాడికి వేలంలో దక్కిన అత్యధిక మొత్తం అందుకున్న ఆటగాడిగా కమిన్స్ రికార్డు కెక్కాడు. కాగా కేకేఆర్ జట్టును రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన గంభీర్ ఈ విషయంపై స్పందించాడు. బౌలర్కు అత్యధిక ధర చెల్లించి బ్యాకప్ బ్యాట్స్మెన్ లేకుండా చేసుకున్నారని విమర్శించాడు. కొత్త బంతితో ప్యాట్ కమిన్స్ అద్భుతంగా రాణించగలడు. అతడికి మంచి బౌలింగ్ నైపుణ్యాలు ఉన్నాయి. డెత్ ఓవర్లలో కూడా మెరుగైన ఫలితాలు రాబట్ట గలుగుతాడు 2014లో అతడు కేకేఆర్తో ఉన్నాడు. ఇక అప్పటితో పోలిస్తే తన ఆట తీరు ఎంతో మెరుగు పడింది. భారీ మొత్తంలో డబ్బు చెల్లించి జట్టు అతడిని కొనుక్కుంది.. కాబట్టి ప్రతీ మ్యాచ్లోనూ అతడు అద్భుత ప్రదర్శన కనబరుస్తాడని అనుకుంటున్నా.
కనీసం మూడు లేదా నాలుగు మ్యాచులైనా ఒంటి చేత్తో గెలిపించ గలగాలి. ఇవన్నీ కమిన్స్కు సంబంధించిన సానుకూల అంశాలు. అయితే ఒకవేళ బ్యాట్స్మెన్లు ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రసెల్ గాయపడితే పరిస్థితి ఏంటి. వారికి బ్యాకప్గా ప్రస్తుత జట్టులో ఎవరూ లేరు. ఇక సునీల్ నరైన్ విషయానికొస్తే తను బౌలింగ్ కూడా చేయ గలుగుతాడు. ముందు చెప్పినట్లు ఇయాన్ గాయపడితే మిడిలార్డర్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అంతే కాదు కమిన్స్ గాయపడితే అతడి స్థానంలో లాకీ ఫెర్గూసన్ ఉంటాడు. కానీ టాప్ ఆర్డర్లో మాత్రం ఎవరు గాయపడినా వారి స్థానాన్ని భర్తీ చేసే వారు జట్టులో లేరు.
మిచెల్ మార్ష్ను గానీ, మార్కర్ స్టోయినిస్ను గానీ తీసుకునే ఉంటే బాగుండేది అని గంభీర్ అభిప్రాయ పడ్డాడు.కాగా 2011 నుంచి ఏడు సీజన్ల పాటు కేకేఆర్కు కెప్టెన్గా వ్యవహరించిన గంభీర్ 2012, 2014లో జట్టును విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అనంతరం సొంత జట్టు ఢిల్లీకి తిరిగొచ్చిన గోతం జట్టుకు విజయాలు అందించలేక పోయాడు. చెత్త ప్రదర్శన కారణంగా.. తనకు నాయకత్వ బాధ్యత నిర్వహించేందుకు సామర్థ్యం సరిపోవడం లేదని.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఆటకు వీడ్కోలు పలికిన గౌతీ.. రాజకీయాల్లో ప్రవేశించి తూర్పు ఢిల్లీ ఎంపీగా ఎన్నికయ్యాడు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి