`చేతులెత్తేశారు..చ‌తికిల ప‌డ్డారు..అబ్బా తొలి దెబ్బ..!

నిన్న‌టి దాకా ఓట‌మి ఎరుగ‌కుండా గెలుపొందుతూ వ‌స్తున్న విరాట్ కోహ్లి సేనకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ప్ర‌పంచ్ క‌ప్ టోర్నీ ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న భార‌త ఆట‌గాళ్లు అటు బౌలింగ్‌లోను..ఇటు బ్యాటింగ్‌లోను ఫెయిల‌య్యారు. ఇప్ప‌టి దాకా టోర్నీ ఫెవ‌రేట్‌గా ఉన్న ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల ధాటికి బ్యాట్స్‌మెన్స్ ప‌రుగులు తీసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ చేయ‌డం మీద దృష్టి పెట్టాడే కానీ జ‌ట్టు విజ‌యం కోసం దృష్టి పెట్ట‌లేక పోయాడు. ఈ అప‌జ‌యంతో నైనా ఇండియా జ‌ట్టు కోలుకుంటే మంచిది లేక‌పోతే క‌ప్ మాటేమిటో కానీ ఉన్న ప‌రువు పోయే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇక ఆట విష‌యానికొస్తే, ఇంగ్లండ్ జ‌ట్టు ఘ‌న విజయాన్ని న‌మోదు చేసుకుని సెమీ ఫైన‌ల్ ఆశ‌లు స‌జీవంగా వుంచుకుంది.

ద‌క్షిణాఫ్రికాకు చుక్క‌లు చూపించి, ఆస్ట్రేలియా దిగ్గ‌జ జ‌ట్టును ఓడించి..పాకిస్తాన్‌ను మ‌ట్టి క‌రిపించి..విండీస్‌ను ఇంటికి పంపించేలా చేసిన భార‌త జ‌ట్టు చివ‌ర‌కు ఇంగ్లండ్ ముందు చేతులెత్తేసింది. ఆ జ‌ట్టు బౌల‌ర్ల ధాటికి మ‌న ఆట‌గాళ్లు విల‌విల‌లాడి పోయారు. సెమీస్‌కు క‌చ్చితంగా చేరాల‌న్న సంకల్పంతో క్రికెట‌ర్లు క‌సితో ఆడారు. ఇండియ‌న్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. ప‌క‌డ్బందీ ప్లాన్‌తో భార‌త్‌ను క‌ట్ట‌డి చేశారు. కోహ్లి సేన జైత్ర‌యాత్ర‌కు అడ్డుకట్ట వేసింది. భారీ స్కోర్ చేసి ఇండియ‌న్స్ పై ఒత్తిడి పెంచింది. రోహిత్ సెంచ‌రీ చేసినా, కోహ్లి, పాండ్యా పోరాడినా ఇంగ్లండ్ వ్యూహాన్ని ఛేదించ‌లేక చ‌తికిల ప‌డ్డారు. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జ‌ట్టు భార‌త బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడారు. ఒకానొక ద‌శ‌లో 360కి పైగా ప‌రుగులు చేస్తార‌ని అనుకున్నా..త‌ర్వాత ష‌మీ ప‌క‌డ్బందీగా బౌలింగ్ చేయ‌డంతో ఆ కాస్తా దూకుడు త‌గ్గింది.

ఇంగ్లండ్ జ‌ట్టులో జానీ బెయిర్ స్టో ..భార‌త ఆట‌గాళ్ల‌కు స్ట్రోక్ తెప్పించేలా ఆడాడు. 109 బంతుల్లో 111 ప‌రుగులు చేశాడు. 10 ఫోర్లు, 6 భారీ సిక్స‌ర్ల‌తో క‌ళ్లు చెదిరేలా ఆడాడు. బెన్ స్టోక్స్ 54 బంతుల్లో 70 ప‌రుగులు చేయ‌గా, జేస‌న్ రాయ్ 57 బంతుల్లో 66 ప‌రుగులు చేసి ఔరా అనిపించారు. మైదానం న‌లువైపులా బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టారు. ష‌మి, బుమ్రా మిన‌హా మిగ‌తా బౌల‌ర్లు పూర్తిగా చేతులెత్తేశారు. భారీ టార్గెట్ ఎంతున్నా ఛేదించే ద‌మ్మున్న ఇండియ‌న్ ఆట‌గాళ్లు ..ఊహించ‌ని రీతిలో ప‌రుగులు చేసేందుకు క‌ష్ట‌ప‌డ్డారు. 5 వికెట్లు కోల్పోయి 306 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. రోహిత్ శ‌ర్మ 15 ఫోర్ల‌తో 109 ప‌రుగులు చేయ‌గా, కోహ్లి 66, పాండ్యా 44 ప‌రుగులు చేసినా టార్గెట్ ను అందుకోలేక పెవీలియ‌న్ బాట ప‌ట్టారు. ఫ్లంకెట్ , వోక్స్ బౌల‌ర్లు ఇండియ‌న్స్ ను ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంతో..ఓట‌మి త‌ప్ప‌లేదు. ధోనీ 42 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచినా ఏ కోశానా ఎదురీద లేక పోయారు. 

కామెంట్‌లు