జ‌గ‌న్ నిర్ణయానికి జ‌నామోదం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న అసాధార‌ణ‌మైన నిర్ణ‌యాన్ని జ‌నం స్వాగ‌తిస్తున్నారు. మొద‌టిసారిగా ఓ మ‌హిళ‌కు ఉన్న‌త‌మైన ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది రాష్ట్రంలో. విజయనగరం జిల్లా  సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనంద గజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం. త‌న‌కు ఈ ప‌ద‌విని అప్ప‌గించ‌డంతో ఆమె ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేసింది. కాగా గ‌త కొన్నేళ్లుగా ఒకే క‌టుంబం చెలాయిస్తున్న ఆధిపత్యానికి చెక్ పెట్టారు. 1958లో దివంగత పి.వి.జి.రాజు నెలకొల్పిన మాన్సాస్‌ సంస్థ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు విద్యా సంస్థలను నడుపుతోంది. 1958లో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పి.వి.జి.రాజు మరణం తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు.
2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ బాధ్యతలు తీసుకున్నారు. అశోక్‌ కుమార్తె అథితి గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌గా తెరపైకి వచ్చారు. 13 వేల ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగిన మాన్సాస్‌ సంస్థ చైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఇప్పటి వరకూ ఉన్నారు. కాగా అనూహ్యంగా అశోక్ గ‌జ‌ప‌తి రాజుకు షాకిచ్చారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానానికి వెళ్లి ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.  చైర్‌పర్సన్‌ పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమెకు ఘనత దక్కింది. సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్లుగా పూసపాటి వంశీయులే కొనసాగుతున్నారు. గతంలో పూసపాటి ఆనందగజపతి రాజు ఉన్నప్పుడు ఆయనే ధర్మకర్తగా ఉండేవారు. ఆయన మరణం తరువాత సోదరుడైన అశోక్‌ గజపతి బాధ్యతలు తీసుకుని నేటి వరకూ కొనసాగారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సభ్యులను నియమించింది. విజయనగరం జిల్లాకు చెందిన వారికి దానిలో ప్రాతినిధ్యం కల్పించింది.
అశోక్‌ టీడీపీలో ఉంటే ఆనందగజపతి కాంగ్రెస్, టీడీపీల్లో పనిచేశారు. ఆయన కుమార్తె అయిన సంచయిత గజపతిరాజు ఢిల్లీలో స్థిర నివాసం అయినప్పటికీ విశాఖ ఏజెన్సీలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారిశుధ్ధ్యం, తాగునీరు రంగాల్లో విశిష్ట సేవలందించిన సంస్థలకు ఇచ్చే గూగుల్‌ గ్లోబల్‌ ఇంపాక్ట్‌ చాలెంజ్‌ అవార్డును 2013లో సాధించారు. ఆ విజయంతో వచ్చిన  3 కోట్లను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇరవై గ్రామాలు, మరో ఇరవై స్కూళ్లకు తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా సంచ‌యిత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌ ఆనర్స్, తర్వాత లా కోర్సు చేసి ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు. ఆమె ఎక్కువ‌గా విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టారు. అంతే కాకుండా పారిశుధ్యం కూడా. ఇప్ప‌టికే సామాజిక బాధ్య‌త‌ను భుజాన వేసుకుని ప‌నిచేస్తున్న సంచ‌యిత‌కు మ‌రో ఉన్న‌త ప‌ద‌వి ద‌క్క‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

కామెంట్‌లు