రాజ‌స్థాన్ అదుర్స్ .. కోల్‌క‌తా బేవార్స్ - వారెవ్వా ప‌రాగ్

ఇదీ ఆట అంటే .ఇదీ క్రికెట్‌కు ఉన్న ప‌వ‌ర్ అంటే..ఐపీఎల్ టోర్న‌మెంట్‌లో హోరా హోరీగా ...నువ్వా నేనా అన్న రీతిలో సాగిన అతి కొద్ది మ్యాచ్‌ల్లో ఇది కూడా ఒక‌టిగా పేర్కొనాలి. న‌రాలు తెగిపోతే బావుణ్ణు అన్నంత‌గా ..ఆఖ‌రు బంతి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ‌కు తెర దించుతూ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ క్రికెట్ జ‌ట్టు రాయ‌ల్‌గా విజ‌యం సాధించింది. టార్గెట్ చేద‌న‌లో ప్రారంభం నుంచే వేగంగా ప‌రుగులు సాధించిన రాజ‌స్థాన్ పీయూస్ చావ్లా స్పిన్ మాయాజాలానికి వెంట వెంట‌నే వికెట్లు పారేసుకున్నారు. ఆ స‌మ‌యంలో బంతులు త‌క్కువ..ప‌రుగులు ఎక్కువ చేయాల్సిన ప‌రిస్థితి. ఈ స్థితిలో క్రీజులోకి వ‌చ్చిన ప‌రాగ్ చిచ్చ‌ర పిడుగులా రెచ్చి పోయాడు. మ‌రో వైపు ఆర్చ‌ర్ కూడా మెరుపులు మెరిపించారు. వీరిద్ద‌రూ ఆడ‌క పోతే..రాజ‌స్థాన్ ప్లే ఆఫ్ పై ఆశ‌లు స‌న్న‌గిల్లేవి.

కోల్‌క‌తాకు వ‌రుస‌గా ఇది ఆరో ఓట‌మి. రాజ‌స్థాన్ అనూహ్యంగా తెర మీద‌కు వ‌చ్చింది. డైన‌మిక్ గా కుర్రాళ్లు దంచి కొట్టారు. ఆద్యంత‌మూ ఆస‌క్తిక‌ర‌మైన పోరును కొన‌సాగించాయి ఇరు జ‌ట్లు. ఇరు జ‌ట్ల అభిమానుల‌కు అంతులేని ఆనందాన్ని క‌లుగ‌జేశారు క్రికెట‌ర్లు. మ‌రో వైపు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టులో కీల‌క‌మైన ఆట‌గాడిగా పేరున్న దినేష్ కార్తీక్ మ‌రోసారి త‌న ప్ర‌తాపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ -12 టోర్నీలో రాజ‌స్థాన్‌కు ఇది నాలుగో విజ‌యం. రియాన్ ప‌రాగ్ కేవలం 31 బంతులు మాత్ర‌మే ఆడి అయిదు ఫోర్లు, రెండు భారీ సిక్స‌ర్ల‌తో 47 ప‌రుగులు చేసి విచిత్ర‌క‌రంగా ఆడి వెనుదిరిగాడు. ఓ ర‌కంగా బౌల‌ర్ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 175 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ ముందుంచింది. 20 ప‌రుగులు ఇచ్చి రెండు కీల‌క వికెట్లు తీశాడు వ‌రుణ్ అరోన్. ప‌రాగ్, ఆర్చ‌ర్‌లు క‌లిసి దుమ్ము రేపారు. 19.2 ఓవ‌ర్ల‌లోనే జ‌ట్టుకు విజ‌యం సాధించి పెట్టారు. ఇక గెల‌వ‌దు అన్న స‌మ‌యంలో ప‌రాగ్ కార‌ణంగా రాజ‌స్థాన్ గ‌ట్టెక్కింది. ర‌హానే 21 బంతుల్లో 34 ప‌రుగులు చేశాడు. ఇందులో అయిదు ఫోర్లు ఒక భారీ సిక్స‌ర్ ఉంది. సంజూ శాంస‌న్ 15 బంతుల్లో 22 ప‌రుగులు చేశాడు.

ఆ జ‌ట్టు 5 ఓవ‌ర్ల‌లో 50 ప‌రుగులు చేసింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌ను స‌రైన్, పీయూష్ చావ్లాలు చెద‌ర‌గొట్టారు. 25 ప‌రుగులు ఇచ్చి స‌రైన్ రెండు వికెట్లు ప‌డ‌గొడితే..చావ్లా కేవ‌లం 20 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ప‌ది ప‌రుగుల తేడాతో ఓపెన్ల‌రిద్ద‌రిని రాజ‌స్థాన్ పోగొట్టుకుంది. స్టీవ్ స్మిత్, స్టోక్స్ ఇంటి బాట ప‌ట్టారు. స్టువ‌ర్ట్ బిన్నీ ఆడ‌తాడానుకున్న స‌మ‌యంలో 11 ప‌రుగుల‌కే వెనుతిరిగాడు. అయిదు వికెట్లు కోల్పోయి 98 ప‌రుగులు చేసింది. బ్యాట్స్‌మెన్స్ ఎవ‌రూ లేక పోవ‌డంతో కోల్‌క‌తా ఈజీగా గెల‌వ‌డం ఖాయ‌మ‌నుకున్నారు స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్. ఇంకేం 17 ఏళ్ల వ‌య‌స్సున్న రియాన్ ..రివ్వుమంటూ మైదానంలోకి వ‌చ్చాడు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నాడు. గోపాల్ 9 బంతులు ఆడి నాలుగు ఫోర్లు కొట్టాడు. గోపాల్ వెనుదిర‌గ‌డంతో క్రీజులోకి వ‌చ్చిన ఆర్చ‌ర్ విరుచుకు ప‌డ్డాడు. హిట్ వికెట్‌గా ప‌రాగ్ వెనుదిరిగాడు. చివ‌రి ఓవ‌ర్‌లో ఆరు బంతుల‌కు 9 ప‌రుగులు చేయాల్సి ఉంది.

ఆర్చ‌ర్ ఉన్నాడుగా..రెండు బంతుల్లో టెన్ష‌న్‌కు తెర దించాడు. ప్ర‌సిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో వ‌రుస‌గా 4, 6 సాధించి రాజ‌స్థాన్‌కు న‌మ్మ‌లేని గెలుపును అందించాడు. అంత‌కు ముందు కోల్‌క‌తా జ‌ట్టులో కెప్టెన్ దినేష్ కార్తీక్ ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. ఇన్నింగ్స్‌కు వెన్నెముక‌గా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జ‌ట్టు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అరోన్ ధాటికి లిన్‌, గిల్‌లు పెవిలియ‌న్ చేరారు. రాణా 21 ప‌రుగులు చేసి ఎనిమిదో ఓవ‌ర్లో అవుట‌య్యాడు. గోపాల్ కూడా క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో దీనేష్ వేగంగా ఆడ‌లేక పోయాడు. 10 ఓవ‌ర్ల‌లో 49 ప‌రుగులు మాత్ర‌మే. ఆ త‌ర్వాత కార్తిక్ రెచ్చి పోయాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌కు ప‌ని చెప్పాడు. చివ‌రి ప‌ది ఓవ‌ర్ల‌లో 126 ప‌రుగులు చేసింది. గోపాల్, సెరైన్ , ఆర్చ‌ర్‌ల‌ను ఆడుకున్నాడు. మొత్తం మీద ఇరు జ‌ట్లు అద్భుత‌మైన ప‌ర్ ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించాయి. క్రికెట్‌కున్న క్రేజ్‌ను మ‌రింత పెంచాయి.

కామెంట్‌లు