జన హృదయపు నేత - మానవత్వపు పతాక ..!
కడదాకా నమ్మిన విలువల కోసం కట్టుబడిన మహోన్నత మానవుడు పారికర్. భ్రష్టుపట్టిన రాజకీయాలలో కడదాకా నిబద్ధతతో బతికిన అతికొద్ది ఎన్నదగిన నాయకులలో ఆయన ఒకరు. అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టి..కష్టపడి ఐఐటీ చదివి ..అత్యున్నతమైన ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి..అనంతరం దేశ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి..అనుకోకుండా రాజీనామా చేసిన అరుదైన నాయకుడు. భూతద్దం పెట్టి వెతికినా నిజాయితీ కలిగిన పొలిటికల్ లీడర్లు కనిపించడం లేదు. మాఫియా కనుసన్నలలో మార్కెట్ నడుస్తున్న సమయంలో ప్రజాస్వామ్యం బతికే ఉందని ఆశించడం అత్యాశే అవుతుంది. 13 డిసెంబర్ 1955లో మనోహర్ గోపాలకృష్ణ పారికర్ గోవాలోని మపూసాలీలో జన్మించాడు. ప్రతిష్టాత్మకమైన ఐఐటీని పూర్తి చేసి సీఎం పదవిని నిర్వహించిన వారిలో దేశంలోనే ఆయన ప్రథముడు.
ప్రజలను ప్రేమించిన ఈ మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి భేషజాలకు తావీయకుండా నమ్మిన వాటికి కట్టుబడ్డారు. చావు పలకరించే వరకు తనకు తోచిన రీతిలో పని చేసుకుంటూనే ఉండి పోయారు. భారతీయ జనతా పార్టీ సమున్నతమైన వ్యక్తిని కోల్పోయింది. జాతి యావత్తు ఇప్పటికీ పారికర్ సాబ్..లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతోంది. కొందరు అలా భూమి మీదకు వస్తారు. ఇలా పది కాలాల పాటు గుర్తుండి పోయేలా చేస్తారు. 2000 నుండి 2005 వరకు , 2012 నుండి 2014 వరకు గోవా సీఎంగా..2014 నుండి 2017 దాకా దేశ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2013లో నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఆయన ప్రపోజ్ చేశారు. యుపీ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. రక్షణ మంత్రిగా రక్షణ రంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. భారీ సంస్కరణలు చేపట్టారు. 1978లో ఐఐటీ ముంబయిలో చేరారు.
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001లో ఐఐటీ చదివి ప్రజా నాయకుడిగా ఉన్నందుకు గాను పారికర్ను ఘనంగా సన్మానించారు. బడిలో వున్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. ఐఐటీకి వెళ్లినా అక్కడ కూడా కాషాయం..హిందూత్వం ఎజెండాగా ముందుకు సాగారు. సంఘ్ చాలక్గా నాయకుడిగా 26 ఏళ్లకే ఎదిగారు. ఉత్తర గోవా నగరంలో పారికర్ పార్టీ పరంగా నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఎంజీపీతో పోటీ పడ్డారు. 1994లో బీజేపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 24 అక్టోబర్ 2000లో భారతీయ జనతా పార్టీకి తిరుగులేని ఆధిక్యాన్ని తీసుకు వచ్చారు. ఏకంగా గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విద్యా రంగంపై దృష్టి పెట్టారు. 51 స్కూళ్లను విద్యా భారతి పేరుతో ఏర్పాటు చేశారు.
5 జూన్ 2002లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాషాయం జెండా ఎగిరింది. తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయడంతో ఆయన వైదొలగాల్సి వచ్చింది. మళ్లీ జరిగిన ఎన్నికల్లో పారికర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. భారీ ఖర్చుతో ఫుట్ బాల్ పోటీలు నిర్వహించారు. దీనిపై కాంగ్రెస్, ఇతర పార్టీలు విమర్శలు చేశాయి. అయినా పట్టించు కోలేదు. పారికర్కు విద్యారంగం, క్రీడా రంగం అంటే ఇష్టం. 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మోడీ హవా నడిచింది. దేశంలో బీజేపీ కొలువు తీరింది. ఎంపీ సీటును బీజేపీ గెలుచుకుంది. పారికర్ గోవా నుండి ఢిల్లీకి మారారు. మోడీ కొలువులో పారికర్కు చోటు దక్కింది. అరుణ్ జైట్లీ స్థానంలో పారికర్ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయి..మంత్రిగా సక్సెస్ అయ్యారు. రక్షణాత్మక పరంగా ఎన్నో చర్యలు చేపట్టారు. అనివార్య కారణాల వల్ల పదవికి రాజీనామా చేశారు. 14 మార్చి 2017లో తిరిగి గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
తీవ్రమైన అనారోగ్య రీత్యా ఆస్పత్రి పాలయ్యారు. చివరకు 17 మార్చి 2019న తుది శ్వాస విడిచారు. 2012లో సిఎన్ ఎన్ ఐబిఎన్ అత్యుత్తమమైన రాజకీయ వేత్తగా అవార్డును ప్రకటించింది. గోవా ఎన్ఐటి గౌరవ డాక్టరేట్ను పారికర్కు బహూకరించింది. మైనార్టీలో ఉన్న సర్కార్ను తన తెలివితో నెట్టుకొచ్చిన ఘనుడు పారికర్. గుండె నిండా ప్రేమను..జీవితాంతం జనం కోసం బతికిన ఈ అరుదైన నాయకుడిని ఇంత త్వరగా కోల్పోవడం ఇటు బీజేపీకి అటు దేశానికి తీరని నష్టంగానే భావించాలి. పారికర్ సాబ్..మళ్లీ ఎప్పుడు మా కోసం పుడతారు అని కోరుకోవడం తప్ప..మీరు ఎక్కడున్నా ..మీ ఆత్మకు శాంతి కలగాలని..ఆ లోకంలో మీరు ప్రశాంతంగా నిద్ర పోవాలని కోరుకోవడం తప్ప.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి